ICICI Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా సందీప్ బక్షి పున: నియమితులయ్యారు. సందీప్ బక్షిని పున: నియమించడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
మరో మూడేండ్ల పాటు సందీప్ బక్షి ఈ పదవిలో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. 2023 అక్టోబర్ నాలుగో తేదీ నుంచి 2026 అక్టోబర్ మూడో తేదీ వరకూ ఆయన ఎండీ కం సీఈఓగా కొనసాగుతారు. గత నెల 30న జరిగిన బ్యాంకు వాటాదారుల వార్షిక సమావేశం (ఏజీఎం)లో సందీప్ బక్షిని ఎండీ కం సీఈఓగా నియమిస్తూ తీర్మానం ఆమోదించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
2018 అక్టోబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా నియమితులయ్యారు సందీప్ బక్షి. అంతకుముందు ఎండీ కం సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ హయాంలో బ్యాంక్ హోల్ టైం డైరెక్టర్ కం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. చందా కొచ్చర్ హయాంలో బ్యాంకులో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు రావడంతో ఆమె స్థానంలో సందీప్ బక్షి నియమితులయ్యారు.