Byju’s | న్యూఢిల్లీ, మార్చి 2: నిధులున్నప్పటికీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి బైజూస్లో ఏర్పడింది. లీగల్ వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ ద్వారా ఇటీవల సమీకరించిన డబ్బును తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులకు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ లేఖ రాశారు. బైజూస్ బ్రాండ్నేమ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ను పలు ఈడీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ స్క్రూటినీ చేస్తుండగా, రవీంద్రన్ను నాయ కత్వం నుంచి తప్పించాలంటూ ఇటీవల కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఆర్థిక ఇబ్బందుల్లోపడ్డప్పటికీ బైజూస్ రూ.1,600 కోట్ల రైట్స్ ఇష్యూను విజయవంతంగా పూర్తిచేసింది. కానీ యూఎస్లోని హెడ్జ్ ఫండ్ నిధుల్ని బైజూస్ దారిమళ్లించిందని, ఈ రైట్స్ ఇష్యూ చట్టవిరుద్ధమని, దానిపై స్టే ఇవ్వాలని కొంతమంది ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నిధుల్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో ఉంచాలని, విత్డ్రా చేయరాదని ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.