Ratan Tata | భారత్ కార్పొరేట్ దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది. ఈ అవార్డు ప్రదానోత్సవ ఫోటోలను టాటా మోటార్స్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథంతో అసాధారణ అంకిత భావం ప్రదర్శించిన వారికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట స్మారక పురస్కారం అందజేస్తారు. ఈ నెల 15న జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
వేల కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్టుల కింద వ్యక్తిగత స్థాయిలో రూ.లక్షల విరాళాలు అందించారు. ఆరోగ్య రక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు భారీగా విరాళాలు అందించారు. తాజాగా పెంపుడు జంతువుల కోసం రూ.165 కోట్ల వ్యయంతో టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ నిర్మించారు. పారిశ్రామిక, సామాజిక సేవలకు గుర్తింపుగా ఇప్పటికే రతన్ టాటా.. కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారాలు పద్మ విభూషణ్ (2008), పద్మ భూషణ్ (2000) అందుకున్నారు.