హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6: ఉత్పాదక రంగంలో మహిళలకు మెరుగైన అవకాశలున్నాయని, ముఖ్యంగా తయారీ విభాగాల్లో నారీమణులు ఉన్నత శిఖరాలను అధిరోహించేస్థాయి ఉన్నదని మానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్ రష్మీ వడ్లకొండ అన్నారు. ఉత్పాదక రంగంలో రాణిస్తూ, నూతన ఆవిష్కరణలను తీర్చిదిద్దుతున్న మహిళలకు ‘ది మాన్యుఫాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఏటా ఉమెన్ మేక్ అవార్డులను అందజేస్తున్నది. ఐర్లాండ్ వేదికగా జరిగిన సమ్మిట్లో 2023కి గాను ఉమెన్ మేక్ అవార్డులో ఎమర్జింగ్ లీడర్గా రష్మీ వడ్లకొండ నిలిచారు.
ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ…డబ్లిన్, ఐర్లాండ్ కేంద్రంగా ప్రముఖ మానుఫాక్చరింగ్ సంస్థ ట్రాన్ టెక్నాలజీలో మానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్గా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని, తన సేవలకుగాను ఎమర్జింగ్ లీడర్ అవార్డుకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగంలో కంపెనీకి సలహాదారుగా సేవలు అందిస్తూనే, యువ ఇంజనీర్లకు దిశానిర్ధేశం చేయడంలో రష్మీ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఉమెన్ ఇన్ మానుఫాక్చరింగ్స్(డబ్ల్యూఐఎమ్) అసోసియేషన్ సౌత్ కరోలినా చాప్టర్కు వైస్ చైర్గా వ్యవహరిస్తూ, డబ్ల్యూఐఎమ్ ఇంటర్నల్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ రంగంలో మహిళల పాత్రను ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నారు. రష్మీతోపాటు ట్రాన్ టెక్నాలజీలో సీనియర్ సిస్టం ఇంజనీర్గా పనిచేస్తున్న వినీతా నల్లా ఉమెన్ మేక్ అవార్డ్ హానరీగా ఎంపికయ్యారు.