హైదరాబాద్, ఏప్రిల్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న చిన్న పిల్లల దవాఖానాల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ షేర్ల ధరల శ్రేణిని రూ.516 నుంచి రూ.542 మధ్యలో నిర్ణయించింది. రూ.1,581 కోట్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనున్నదని తెలిపింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 26న బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వాటాల విక్రయంలో సగం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగతా 15 శాతం నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది సంస్థ. ఒక్కో ఇన్వెస్టర్ కనీసంగా 27 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ రమేశ్ మాట్లాడుతూ..వచ్చే మూడేండ్లకాలంలో హైదరాబాద్తోపాటు బెంగళూరులో ఉన్న దవాఖానాల్లో కొత్తగా 500 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకోసం రూ.300 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఐపీవో ద్వారా సేకరించిన నిధుల్లో రూ.170 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనుండగా, మిగతా నిధులను సంస్థ వద్ద ఉన్న రూ.200 కోట్ల మిగులు నగదు నిల్వల్లో తీసి ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో పడకను ఏర్పాటు చేయడానికి గరిష్ఠంగా రూ.60 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు ఆరు నగరాల్లో 14 దవాఖానాలు, మూడు క్లినిక్స్లు ఉన్నాయి.