హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రైల్వేల్లో స్టార్టప్ల కోసం టీ-హబ్తో ఒప్పందం చేసుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, ఆయన బృందంతో ఎస్సీఆర్ జోన్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సమావేశమయ్యారు. ఇండియన్ రైల్వేస్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టార్టప్ ఫర్ రైల్వేస్’ విధానంలో భాగంగా ఎస్సీఆర్ అధికారులు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చూస్తున్నారు.
కాగా, భారతీయ రైల్వేలోని కొన్ని క్లిష్టమైన అంశాల పరిష్కారానికి వర్ధమాన సంస్థల భాగస్వామ్యాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ‘స్టార్టప్ ఫర్ రైల్వేస్’ పరిచయమైందని ఈ సందర్భంగా జైన్ చెప్పారు. పూర్తి వివరాలు https://innovation.indianrailways.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టార్టప్లకు తొలుత రూ.1.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం చేయనున్నారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్)పై ప్రత్యేక యాజమాన్య హక్కులుంటాయి.