Raghuram Rajan | దేశ ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలమైన ఆర్థిక గ్రోత్ సాధించామని చెబుతున్నదంతా ‘ప్రచారం’ తప్ప మరొకటి లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ తన శక్తి సామర్థ్యాల మేరకు పుంజుకోవాలంటే గణనీయ స్థాయిలో సంస్థాగత సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి విద్యారంగంతోపాటు వృత్తి నైపుణ్యం మెరుగుదలకు పెనుగులాట తప్పదని పేర్కొన్నారు. యువతరానికి వృద్ధి ఫలాలు అందుబాటులోకి తేవాలంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంస్థాగత సమస్యలు పరిష్కరించకుంటే కష్ట పడాల్సి ఉంటుందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల్లో 30 ఏండ్ల లోపు వారు సగానికి పైగా ఉంటారని గుర్తు చేశారు.
ఆర్థిక వృద్ధిపై ప్రచారార్భాటాన్ని నమ్మడం అతిపెద్ద పొరపాటు అని రఘురామ్ రాజన్ అభిప్రాయ పడ్డారు. ‘ప్రచారార్భాటాన్ని నిజం చేయాలంటే మనం చాలా ఏండ్ల తరబడి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం ఎంతో సాధించామని నమ్మించడానికే కొందరు రాజకీయ నాయకులు ప్రచారార్భాటం చేస్తున్నారు’ అని అన్నారు. కానీ ఆ ప్రచారార్భాటాన్ని నమ్మి లొంగిపోతే భారత్ కు అది తీవ్రమైన పొరపాటు అవుతుందని స్పష్టం చేశారు.
మన పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడం లేదని, అధిక స్థాయిలో డ్రాపవుట్లు నమోదు అవుతున్నాయని రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్ష అర్ధరహితం అని అన్నారు. ‘మన దగ్గర శ్రామికశక్తి పెరుగుతున్నది. ఆ శ్రామిక శక్తికి మంచి ఉద్యోగాలు లభిస్తేనే అది మనకు లబ్ధి చేకూరుతుంది’ అని చెప్పారు.
తొలుత శ్రామిక శక్తికి మరిన్ని ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. తదుపరి దశలో శ్రామిక శక్తికి అవసరమైన ఉద్యోగాలు కల్పించాలన్నారు. కరోనా మహమ్మారి తర్వాత స్కూళ్లలో డ్రాపవుట్లు 2012 స్థాయికి పడిపోయాయన్నారు. 20.5 శాతం మంది గ్రేడ్-3 విద్యార్థులు మాత్రమే గ్రేడ్-2 పుస్తకాలు చదువగలుగుతున్నారని చెప్పారు. వియత్నాం వంటి ఆసియా దేశాల కంటే తక్కువగా భారత్ అక్షరాస్యత రేట్ నమోదవుతుందని చెప్పారు.