Raghu Ram Rajan on Adani | అదానీ గ్రూప్ సంస్థల పట్ల దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తీరుపై ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై యూఎస్ షార్ట్ షెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక లేవనెత్తిన వివాదాంశాల్లో మూలాలపై సెబీ ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. కేవలం అదానీ గ్రూప్ సంస్థల్లో స్టాక్స్ కొనుగోలు కోసం 690 కోట్ల డాలర్లు (దాదాపు రూ.56,600 కోట్ల) నిధుల్లో 90 శాతం పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేస్తున్న నాలుగు మారిషస్ ఫండ్ సంస్థల లావాదేవీలపై ఎందుకు దృష్టి సారించలేదని నిలదీశారు. మారిషస్ కేంద్రంగా పని చేస్తున్న ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, క్రెస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థలు కేవలం అదానీ గ్రూప్ సంస్థల షేర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్లకు స్వర్గధామంగా భావించే మారిషస్లో ఏర్పాటైన కంపెనీల యాజమాన్యాలపై సందేహాలు ఉన్నాయని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ మారిషస్ ఫండ్ కంపెనీల లావాదేవీల వివరాలను తెలుసుకోవడానికి పరిశోధనా సంస్థల సహకారం తీసుకుంటుందేమోనన్నారు. ప్రైవేట్ రంగ కుటుంబ సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువగా ఉండాలని తాను అనుకోవడం లేదన్నారు. కానీ, ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, నియంత్రన సంస్థలకు, కార్పొరేట్ కంపెనీల మధ్య పారదర్శకతా లోపాలు తగ్గించాలన్నారు. నియంత్రణసంస్థలు స్వేచ్ఛగా పని చేసుకునే వీలు కల్పించాలని సూచించారు.
భారత్ ఆర్థికాభివృద్ధి.. హిందూ వృద్ధిరేటుకు అత్యంత దగ్గరవుతుందని రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదించడం, ధరలను కట్టడి చేయడానికి అధిక వడ్డీరేట్లు, మందకోడిగా ప్రైవేట్ పెట్టుబడులు ఉండటం దీనికి కారణాలని స్పష్టం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతానికి పడిపోవడం ఆందోళనకరం అని స్పష్టం చేశారు. 1950-80 మధ్య వృద్ధిరేటు సగటున నాలుగు శాతం నమోదైంది. దీన్ని ‘హిందూ వృద్ధిరేటు’ అని అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా నమోదైన జీడీపీ.. రెండో త్రైమాసికానికి 6.3 శాతానికి, మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి దిగి వచ్చింది. కనుక వృద్ధిరేటు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని కేంద్రానికి సూచించారు.