ముంబై, అక్టోబర్ 6: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు ఊపునిచ్చాయి. వడ్డీరేట్లకు సంబంధించిన రంగాలైన ఆర్థిక, రియల్టీ, వాహన రంగ షేర్లు మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడేలోనే 66 వేలు దాటిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరివరకు ఇదే ట్రెండ్ను కొనసాగించింది. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు మళ్లించాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 364.06 పాయింట్లు ఎగబాకి 65,995.63 వద్ద ముగియగా..ఎన్ఎస్ఈ నిఫ్టీ 107.75 పాయింట్లు అందుకొని 19,653.50 వద్ద స్థిరపడింది.
ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్గా నిలిచింది. వడ్డీరేట్లు యథాతథంగా ఉండటంతో ఆర్థిక సేవల సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో బజాజ్ ఫిన్సర్వ్ షేరు 6 శాతం లాభపడగా..బజాజ్ ఫైనాన్స్ 4 శాతం, టైటాన్ 2.98 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.
కానీ, ఇదే సమయంలో హిందుస్థాన్ యునిలీవర్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు దూకుడును ప్రదర్శించాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఈ రంగ షేర్లు మూడు శాతం వరకు లాభపడ్డాయి. కానీ, టెలికం రంగ సూచీలు నష్టపోయాయి.
ఈవారంలో సెన్సెక్స్ 167.22 పాయింట్లు, నిఫ్టీ 15.2 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. బాండ్లు క్రాష్ కావడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీకి తరలించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా కలిసొచ్చింది.
– వినోద్ నాయర్,జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్