ముంబై, నవంబర్ 1: దేశంలో బంగారం డిమాండ్ కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 191.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 168 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తమ తాజా నివేదిక ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ3-2022’లో తెలియజేసింది. దీంతో వార్షిక వృద్ధిరేటు 14 శాతంగా ఉన్నది.
ఈ ఏడాది తొలి 9 నెలల్లో (జనవరి-సెప్టెంబర్) దేశంలోకి 559 టన్నుల పసిడి దిగుమతి అయినట్టు డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే గత ఏడాది మొత్తంగా దేశంలోకి 1,003 టన్నుల బంగారం దిగుమతి అయ్యిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్నుబట్టి నిరుడు కంటే ఈ ఏడాది ఎక్కువగా దిగుమతి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దాదాపు 750-800 టన్నుల దిగుమతులు జరగవచ్చని అంచనా వేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద బంగారం నిల్వలు 785 టన్నులకు చేరినట్టు తాజా నివేదిక తెలియజేసింది. జూలైలో 13 టన్నులు, సెప్టెంబర్లో 4 టన్నులు ఆర్బీఐ కొన్నట్టు ఇందులో డబ్ల్యూజీసీ వెల్లడించింది. ఇదిలావుంటే ప్రపంచ గోల్డ్ డిమాండ్ ఈ జూలై-సెప్టెంబర్లో 28 శాతం పెరిగి 1,181.5 టన్నులను తాకింది. పెట్టుబడులు మాత్రం 47 శాతం తగ్గాయి. పసిడి ఆధారిత ఈటీఎఫ్ల నుంచి ఏకంగా 227 టన్నుల ఉపసంహరణ జరిగింది.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారతీయ గోల్డ్ డిమాండ్ గతంతో పోల్చితే 14 శాతం ఎగిసి 191.7 టన్నులకు చేరింది. పసిడి వినియోగదారులు కొనుగోళ్లకు ప్రాధాన్యతనిచ్చారు. దీంతో కరోనాకు ముందున్న స్థాయికి మళ్లీ మార్కెట్లో గోల్డ్ డిమాండ్ వెళ్లింది. రుణ లభ్యత పెరగడం, నగరాలు-పట్టణాలు-గ్రామాల్లో కొనుగోళ్లు పుంజుకోవడం కలిసొచ్చింది.
-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో