Infosys | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు నిరాశ పరిచేలా కనిపిస్తున్నాయి. గతేడాది (2021-22)తో పోలిస్తే గత జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం 3.2 శాతం పెరిగి రూ.5,360 కోట్లకు చేరుకున్నది. ఆదివారం ఇన్ఫోసిస్ తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికంలో ఇది రూ.5,195 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే 5.7 శాతం తక్కువే. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.5,686 కోట్లు. ఇతర ఐటీ సంస్థల మాదిరిగానే ఇన్ఫోసిస్ను ఉద్యోగుల అట్రిక్షన్లు (వలసలు attrition ) వెంటాడుతున్నాయి.
ఇన్ఫోసిస్ ఆదాయంలో 24 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది రూ.27,896 కోట్ల రెవెన్యూ సంపాదించగా, ఈ ఏడాది రూ.34,470 కోట్లకు పెంచుకుంది. గత మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏడు శాతం ఎక్కువ. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో 27.7 శాతం మంది ఉద్యోగులు అట్రిక్షన్ బాట పడితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది 28.4 శాతానికి పెరిగింది. 2021-22 జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నుంచి అట్రిక్షన్లు 13.9 శాతం పెరిగాయి.
సంస్థకు వచ్చే రెవెన్యూలో అమెరికా టాప్లో కొనసాగుతున్నది. మొత్తం ఇన్ఫోసిస్ ఆదాయంలో అమెరికా నుంచి 61.8 శాతం ఆదాయం లభిస్తున్నది. యూరప్ దేశాల నుంచి 25 శాతం.. మిగతా ప్రపంచ దేశాల నుంచి 10.6 శాతం, భారత్లో దేశీయ కార్యకలాపాల నుంచి 2.6 శాతం ఆదాయం సంపాదిస్తున్నది. శుక్రవారం ముగిసిన ట్రేడింగ్లో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 1.73 శాతం పతనమై రూ.1506.30లకు పడిపోయింది. ఈ ఏడాది ఇన్ఫీ స్క్రిప్ట్ 19 శాతం నష్టపోయింది.