Ratan Tata | న్యూఢిల్లీ, మార్చి 16: టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. దాతృత్వ రంగంలో ఆయన చేసిన సేవలకుగాను పీవీ నర్సిహారావు మెమోరియల్ అవార్డుతో సత్కరించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును రతన్ టాటాకు అందించారు. వ్యాపార ప్రపంచంలో రతన్ టాటా చాలా కీలకమైన వ్యక్తి, దాతృత్వంలో ఆయన చేసిన కృషికి, అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపు లభించినట్లు అయింది.
ఏటా సంక్షేమం, మానవతా కారణాల కోసం అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సారి మాత్రం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను వరించింది. ఆయనకు వచ్చిన ఆదాయంలో సగం దాతృత్వాలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా టాటా ట్రస్ట్ను ఏర్పాటు చేశారు కూడా. ఇలా కేటాయించిన నిధులను వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ సమతుల్యత కోసం వినియోగిస్తున్నారు. 86 ఏండ్ల వయస్సు కలిగిన రతన్ టాటాకు 2008 ఏడాదికిగాను పద్మ విభూషణ్, 2000కిగాను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించారు.