ముంబై, ఆగస్టు 31: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) స్థానిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. 20 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. ఏకంగా 2,482 మంది ఆఫీసర్ ఫ్లూయెంట్ ఉద్యోగులను తీసుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. స్థానిక భాషల్లో వినియోగదారులతో సంభాషించే బ్యాంక్ సిబ్బంది సామర్థ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో స్థానిక బ్యాంక్ అధికారులను నియమించుకుంటున్నట్టు తెలిపింది.
ఎంపికైన ఉద్యోగి తమ రాష్ట్రంలోనే 12 ఏండ్లు పనిచేసేలా లేకపోతే ఒక నిర్దిష్ఠ స్థాయికి ఉద్యోగోన్నతి పొందే వరకు అక్కడే పనిచేసేలా ఒక నిబంధన ఉన్నదని పేర్కొంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు కలుపుకొని 20 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్టు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాల్ సింగ్ తెలిపారు. 21 ఏండ్ల నుంచి 30 ఏండ్లలోపు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్తి..కమర్షియల్ బ్యాంక్లో కనీసం ఏడాది పాటు పనిచేసిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.