ముంబై, జూన్ 10: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ముగిసిన మే నెలలో 11.26 శాతం క్షీణించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.14,056 కోట్లకు పరిమితంకాగా, 2022 మే నెలలో ఇది రూ.15,840.63 కోట్లుగా ఉంది.ఈ ఏడాది మే నెలలో దేశంలోని మొత్తం జీవిత బీమా సంస్థలు కొత్తగా ప్రారంభమైన పాలసీల ద్వారా ఆర్జించిన ఆదాయం 4.1 శాతం క్షీణించి రూ. 23,477.8 కోట్లకు చేరింది. నిరుడు ఇదే నెలలో ఇవి రూ.24,480.36 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
ప్రభుత్వ రంగ ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం మే నెలలో క్షీణించగా, ప్రైవేటు రంగంలోని 23 జీవిత బీమా సంస్థల ఆదాయం మాత్రం 9.05 శాతం పెరిగి రూ.8,639.72 కోట్ల నుంచి రూ.9,421.51 కోట్లకు చేరుకుంది. ఎల్ఐసీతో కలుపుకుని మొత్తం 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) 15 శాతం క్షీణించి రూ.42,419.97 కోట్ల నుంచి రూ. 36,043.11 కోట్లకు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్ లీడర్ అయిన ఎల్ఐసీ ఆదాయం తగ్గడమే. ఈ రెండు నెలల్లో ఎల్ఐసీ కొత్త వ్యాపారం 28 శాతం క్షీణించి రూ. 27, 557 కోట్ల నుంచి రూ. 19,866 కోట్లకు తగ్గింది.