హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్లోని ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా పేరుగాంచిన జీనోమ్ వ్యాలీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దాదాపు రూ.700 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ ఓ నూతన పశు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ఏర్పాటు చేయనున్నది. పాదాలు-నోటి రోగాలు (ఎఫ్ఎండీ), ఇతరత్రా కొత్త వ్యాధుల చికిత్సకుగాను రాబోయే ప్లాంట్లో వ్యాక్సిన్లను ఐఐఎల్ ఉత్పత్తి చేస్తుంది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఐఐఎల్ ఉన్నత వర్గాలు భేటీ అయ్యాయి. ఈ క్రమంలోనే కొత్త ప్లాంట్ వివరాలొచ్చాయి. సంస్థ ఎండీ డాక్టర్ కే ఆనంద్ కుమార్తోపాటు సీనియర్ ఉపాధ్యక్షులు ముకుల్ గౌర్, ఎన్ఎస్ఎన్ భార్గవ్ తదితరులు కేటీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐఐఎల్ భవిష్యత్ కార్యాచరణను మంత్రికి వారంతా వివరించారు.
750 మందికి ఉద్యోగావకాశాలు
జీనోమ్ వ్యాలీ ఫేజ్ 3లో ఏర్పాటయ్యే ఈ ఐఐఎల్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుతో సుమారు 750 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు రానున్నాయి. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థే ఐఐఎల్. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఎండీ వ్యాక్సిన్ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్న సంస్థల్లో ఐఐఎల్ కూడా ఒకటి. ఇక ఐఐఎల్కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ ఉత్పాదక కేంద్రాలున్నాయి. ఇందులో హైదరాబాద్లోనే రెండుండగా.. గచ్చిబౌలి, కరకపట్లలో ఇవి ఉన్నాయి. మరొకటి ఊటీలో ఉన్నది. దేశంలో నాల్గోది, హైదరాబాద్లో మూడో ప్లాంట్ను ఐఐఎల్ తెస్తున్నది. న్యూజీలాండ్లోనూ ఓ ప్లాంటున్నది.
ఏటా 30 కోట్ల డోసులు
ఈ కొత్త ప్లాంట్లో తయారయ్యే ఎఫ్ఎండీ వ్యాక్సిన్లతో ఐఐఎల్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం మరో 30 కోట్ల డోసులు పెరగవచ్చని అంచనా. వెటర్నరీ, హ్యూమన్ బయోలాజికల్స్లో దేశీయ మార్కెట్లోనే ప్రధాన సంస్థగా వెలుగొందుతున్న ఐఐఎల్.. 150కిపైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నది.
జీనోమ్ వ్యాలీలో మరో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను ఐఐఎల్ ఏర్పాటు చేయబోతుండటం సంతోషకరం. ఇప్పటికే హైదరాబాద్.. వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచ రాజధానిగా పేరొందింది. ఈ క్రమంలో వస్తున్న ఐఐఎల్ కొత్త ప్లాంట్ మరిన్ని అవకాశాలకు ఊతమివ్వగలదు.
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఐఐఎల్ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. హైదరాబాద్లో మేము తెస్తున్న ఈ మూడో వ్యాక్సిన్ కేంద్రం.. వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వయంశక్తిని మరింతగా చాటగలదని ఆశిస్తున్నాం. అంతేగాక మా ఈ ప్లాంట్.. వేల కోట్ల రూపాయల్లో జాతి సంపదనూ కాపాడగలదు.
-కే ఆనంద్ కుమార్, ఐఐఎల్ ఎండీ