Stocks | కొద్దిసేపట్లో పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ఫ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.17 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 71,800, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల లబ్ధితో 21,739 పాయింట్ల వద్ద కొనసాగింది. 9.34 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ 247 పాయింట్లు లబ్ధి పొంది తదుపరి నష్టాల్లోకి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 21,788 పాయింట్ల గరిష్టాన్ని తాకి, తిరిగి సుమారు 21,700 పాయింట్ల వద్ద తచ్చాడుతున్నది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ లాభాల్లో సాగుతున్నాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, ఐటీసీ, నెస్ట్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ పతనం అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ పై 81.71 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ 83.02 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.