హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సదరు సంస్థ నరాలు, గుండె చికిత్సకు సంబంధించి డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ను తయారు చేయనున్నది. నికిల్, కోబాల్ట్ అలెర్జెనిక్ అయాన్లు లేని మిశ్రమం నుంచి తయారుచేసే మొట్టమొదటి స్టెంట్ ఇది కావడం విశేషం. అలాగే మెటాలిక్ బయోరిసోర్సబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్లను కూడా తయారు చేయనుంది. ఇది రీ-ప్రొసీజర్ రేట్లను తగ్గించనుంది.
ఐఎస్బీ పూర్వ విద్యార్థులదే..
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పూర్వ విద్యార్థులు నెలకొల్పిన ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థ.. ప్రస్తుతం కర్నాటకలోని మైసూరులో ఆర్అండ్డీ సెంటర్ను, అలాగే పైలట్ తయారీ ప్లాంటును నిర్వహిస్తున్నది. సంస్థ ప్రమోటర్లు బదరి నారాయణ్, డాక్టర్ విజయ గోపాల్ గురువారం హైదరాబాద్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశమై మెడికల్ డివైజెస్ పార్కులో యూనిట్ ఏర్పాట్లపై చర్చించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్, ఫార్మా విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశంలో వైద్య పరికరాల హబ్గా ఎదుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు. ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్కు స్వాగతం పలికారు. 2017లో రూ.1,500కోట్ల పెట్టుబడులు, 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పార్కును ప్రారంభించినప్పటి నుంచి అద్భుతమైన వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బదరి నారాయణ్ మాట్లాడుతూ.. చౌకగా వైద్య పరికరాలను తయారు చేయడం తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. రూ.250కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ను తయారు చేయనున్నట్టు వివరించారు.
750 మందికి ఉపాధి..
తమ సంస్థలో 500 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. తాము ఏర్పాటుచేయనున్న సంస్థలో న్యూరో ఇంటర్వెన్షనల్ మెడికల్ డివైజెస్తోపాటు న్యూరో ట్రైనింగ్ సెంటర్, కార్డియో ఇంటర్వెన్షనల్ మెడికల్ డివైజెస్, డ్రగ్ కోటెడ్ క్రిటికల్ కేర్ కాథెటర్స్ తదితర మూడు విభాగాలుంటాయన్నారు. యూఎస్ఎఫ్డీఏ నిబంధనల ప్రకారం ఐదు ఎకరాల విస్తీర్ణంలో లక్ష చదరపు అడుగుల్లో సంస్థను నెలకొల్పనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎస్ఈ ఒప్పందం
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఆర్థిక ప్రయోజనం కల్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా నిధుల సమీకరణలో ఎంఎస్ఎంఈలకు తగిన సహకారం అందించే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కే అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.