Property Tax | ఎవరైనా సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తారు. కరోనా మహమ్మారి తర్వాత సాధ్యమైనంత మేరకు స్పేసియస్గా ఉన్న ఇంటి కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి. 3.6 లక్షల కోట్లకు పైగా ఇండ్ల విక్రయాలు జరిగాయి. మీరు కూడా ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటున్నారా.. ? అపార్ట్మెంట్ ప్లాట్ కొనుక్కోవాలని భావిస్తున్నారా.. అయితే, కొన్ని ముఖ్యమైన అంశాలు మరిచిపోవద్దు. ప్రత్యేకించి ప్రాపర్టీ టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పట్టణాలు, నగరాల పరిధిలో ఇండ్లు, అపార్ట్మెంట్ ప్లాట్లపై మున్సిపల్ అధికారులు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తుంటారు. ప్రాపర్టీ టాక్స్ సకాలంలో చెల్లించకపోతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. నిర్దిష్ట గడువులోగా ప్రాపర్టీ టాక్స్ చెల్లించని డిఫాల్టర్లపై మున్సిపల్ కార్పొరేషన్లు తరుచుగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. ఉదాహరణకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించని వారి నుంచి ప్రతి నెలా ఒకశాతం పెనాల్టీ వసూలు చేస్తారు. మున్సిపల్ అధికారులు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం చాలా ప్రాధాన్యం కలిగి ఉందని టాక్స్ కన్సల్టెంట్ అమృత దేవయాని చెప్పారు.
ప్రాపర్టీ టాక్స్ చెల్లించని వారికి మున్సిపల్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా సంబంధిత ఇంటి యజమాని స్పందించకపోతే చట్ట పరంగా తీసుకునే అధికారం మున్సిపల్ అధికారులదేనని అమృత దేవయాని అన్నారు. షోకాజ్ నోటీసును కూడా నిర్లక్ష్యం చేసిన డిఫాల్టర్లపై 15-20 శాతం వరకు పెనాల్టీ విధిస్తున్నాయి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు. ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడానికి అధికారులకు సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం కూడా ఉంది. ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడే వారికి జైలుశిక్ష, ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి.