Homes in Mumbai | దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో సొంతిండ్ల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. గతేడాదితో పోలిస్తే 21 శాతం ఇండ్ల కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు 21 శాతం పెరిగాయి. గత దశాబ్ది కాలంలోనే బెస్ట్ అని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే గత నెలలో ముంబైలో 9,525 ఇండ్ల కొనుగోళ్లు జరిగాయి. ఒకవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచినా సొంతిండ్ల కొనుగోళ్లు పెరగడం గమనార్హం. గత మే నెలలో 9,839 సొంత ఇండ్ల కొనుగోళ్లు జరిగాయి. ముంబై మున్సిపల్ రీజియన్ (బీఎంసీ ఏరియా)లో జూన్ నెలలో 7,856 ఆస్తుల రిజిస్ట్రేషన్ నమోదయ్యాయి.
సొంతిండ్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటంతో ముంబైలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఆస్తుల కొనుగోళ్లకు డిమాండ్ పుంజుకున్నదని నైట్ ఫ్రాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. గత నెలలో ఇండ్ల రిజిస్ట్రేషన్లు దశాబ్దిలోనే బెస్ట్ అని నైట్ఫ్రాంక్ తన నివేదికలో తెలిపింది. ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లతోపాటు ఇండ్ల ధరలు పెరిగినా చౌకధరకు ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ ఉందని శిశిర్ బైజాల్ తెలిపారు.
రిజిస్టర్డ్ ఇండ్ల విక్రయాల్లో 87 శాతం రెసిడెన్షియల్, ఎనిమిది శాతం వాణిజ్య సముదాయాలు ఉన్నాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఇండ్ల రిజిస్ట్రేషన్ల రూపేణా మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.697 కోట్లకు పైగా ఆదాయం లభించింది.