Semi Conductors | ఇప్పటికీ కార్ల తయారీకి సెమీ కండక్టర్ల కొరత సమస్యగానే ఉన్నదని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పేర్కొంది. పరిమితంగా ఎలక్ట్రానిక్ విడి భాగాల లభ్యత తమ కార్ల తయారీ ప్రణాళికలో ఒక సవాల్గా మారిందని మారుతి సుజుకి సీఎఫ్వో అజయ్ సేథ్ చెప్పారు. `అందుబాటులో ఉన్న సెమీ కండక్టర్లకు అనుగుణంగా గరిష్ఠ స్థాయిలో కార్ల తయారీకి మా సప్లయ్ చైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్, సేల్స్ టీమ్లు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
డిసెంబర్ త్రైమాసికం నాటికి 3.63 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. పరిస్థితిని బట్టి, ఎలక్ట్రానిక్ విడి భాగాల లభ్యత ఆధారంగా ఉత్పత్తి పెంచడానికి గల మార్గాలపై పని చేస్తున్నామని అజయ్ సేథ్ చెప్పారు. ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే.. డిసెంబర్ త్రైమాసికంలో సెమీ కండక్టర్ల సరఫరా పరిస్థితి మెరుగైందన్నారు. సెమీ కండక్టర్ల కొరత వల్ల అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో దాదాపు 46 వేల యూనిట్లు ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపారు.
మానేసర్, గుర్గ్రామ్ యూనిట్లలో ఏటా 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. గుజరాత్ లోని ఉత్పాదక యూనిట్ నుంచి మరో 7.5 లక్షల యూనిట్లు జత కలుస్తాయి. ఇంధన ధరలు అసాధారణ స్థాయిలో పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా సీఎన్జీ గ్యాస్ ఆధారిత కార్ల తయారీపై ఫోకస్ చేస్తున్నట్లు అజయ్ సేథ్ వెల్లడించారు.