న్యూఢిల్లీ, జూన్ 7: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఏడాది క్రితం ప్రారంభించిన టాక్స్ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్లో తిరిగి సమస్యలు తలెత్తాయి. ఈ పోర్టల్ తొలి వార్షికోత్సవం రోజైన మంగళవారం సమస్యలు తలెత్తడంతో పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం సమస్యల్ని తక్షణం పరిష్కరించాలంటూ ఈ పోర్టల్ డెవలపర్ అయిన ఇన్ఫోసిస్ను ఆదేశించింది. 2021 జూన్ 7న ఈ పోర్టల్ ప్రారంభమైన తర్వాత పలు వారాలు సాంకేతిక సమస్యలతో పన్ను చెల్లింపుదార్లను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం సైతం టాక్స్ రిటర్న్లు దాఖలు చేసేందుకు గడువు తేదీని పొడిగించింది. ఇప్పుడు తిరిగి స్నాగ్స్ ఏర్పడటంతో యానివర్సిరీ రోజున ఈ పోర్టల్ను హ్యాక్ చేశారా అన్న అనుమానాన్ని పలు యూజర్లు వ్యక్తం చేశారు. పోర్టల్లోకి లాగిన్ కాలేకపోతున్నామంటూ పలువురు ఫిర్యాదుచేయగా, సెర్స్ సదుపాయం సరిగ్గా పనిచేయడం లేదంటూ మరికొందరు తెలిపారు. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో సెర్చ్ ఫంక్షనాలిటీలో సమస్య తలెత్తినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిని సరిచేయమంటూ ఇన్ఫోసిస్ను ఆదేశించామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. సమస్యను పరిష్కరిస్తున్నట్టు ఇన్ఫోసిస్ ధృవీకరించిందని శాఖ తెలిపింది.