న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తాయని, ఇందుకు వచ్చే 4-5 ఏండ్లలో రూ.32,500 కోట్లు పెట్టుబడి చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ పెట్టుబడితో ప్రస్తుత పడకల సామర్థ్యానికి మరో 30,000 బెడ్స్ను జతచేస్తాయన్నది. హెల్త్కేర్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల అక్యుపెన్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 శాతం ఉంటుందని, కొవిడ్ పాండమిక్ తర్వాత మెడికల్ టూరిజం పునరుద్ధరణతో వ్యవస్థాగత ప్రైవేటు హాస్పిటల్స్ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ మైత్రి మాచెర్ల వివరించారు.
పడకల విస్తరణలో మెట్రో నగరాలు ముందు ఉంటాయని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల్లో గణనీయమైన స్థాయిలో హాస్పిటల్ బెడ్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్ సదుపాయం వ్యాప్తిచెందడం, జీవనశైలి వ్యాధులు, మెడికల్ టూరిజం వృద్ధి తదితర అంశాలతో సర్జరీలకు డిమాండ్ పెరుగుతున్నదని, దీంతో హాస్పిటల్ పరిశ్రమలోని వ్యవస్థాగత కంపెనీలు ప్రయోజనం పొందుతాయన్నారు.