Mobile Tariffs | న్యూఢిల్లీ, మార్చి 25: మొబైల్ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయి. గత రెండేండ్లుగా చార్జీలను ముట్టుకోని దేశీయ టెలికం సంస్థలు మళ్లీ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్లను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనావేస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ ధరల పెంపుపై సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయని, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇవి పూర్తి అయిన తర్వాతనే పెంపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. కస్టమర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా మరోసారి కస్టమర్లపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి.
ధరల్లో వ్యత్యాసం
ఎంట్రీ లెవల్ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు ప్రత్యేక ధరల్లో ప్లాన్లను ప్రకటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి టెలికం సంస్థలు ఇబ్బడిముబ్బడి టారిఫ్ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెట్వర్క్ నెలనెల చెల్లింపులు జరపలేకపోతున్నారని, దీంతో టెలికం సంస్థలు వీరికోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాల్సి అవసరం ఎంతైనా ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికం చార్జీలు తక్కువగా ఉన్న భారత్లో 5జీ నెట్వర్క్ కోసం సంస్థలు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. 2021లో చార్జీలను పెంచాయి.