Medicines Prices rise | 10 శాతంపైగా పెరగనున్న ఫీవర్, బీపీ గోళీలు, యాంటిబయోటిక్స్
న్యూఢిల్లీ, మార్చి 4: దాదాపు 800 ఔషధాలు, వైద్య పరికరాల ధరలు గత కొన్నేండ్లుగా ఎన్నడూలేనంత స్థాయిలో ఈ ఏడాది పెరగనున్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) జాబితాలోనున్న ఈ మందుల ధరలు ఏటా సగటున 2-3 శాతం పెరుగుతుండగా, 2022లో మాత్రం 10 శాతాన్ని మించి అధికం కావచ్చని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. జ్వరం, ఇన్ఫెక్షన్, బీపీ, రక్తహీనత, హృదయ సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులు తదితరాల చికిత్సకు ఉపయోగించే ఔషధాలు ఎన్ఎల్ఈఎం జాబితాలో ఉంటాయి. ఈ మందుల ధరల్ని టోకు ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా నిర్ణయిస్తారు.
భారత మార్కెట్లో దాదాపు 6,000కుపైగా ఔషధ పార్ములేషన్లు లభిస్తున్నాయి. ఇందులో 17-18 శాతం షెడ్యూల్డ్ డ్రగ్స్. వీటి ధరల్నే ప్రభుత్వం ఏటా సవరిస్తూ ఉంటుంది. కొద్ది సంవత్సరాలుగా కరోనరీ స్టెంట్స్, మోకాలి ఇంప్లాంట్స్ వంటి వైద్య సాధనాల్ని కూడా ధరల నియంత్రణలోకి తీసుకొచ్చారు. మరోవైపు ఉత్పాదక వ్యయాలు భారీగా పెరిగినందున పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, నాన్-షెడ్యూల్డ్ ధరల్ని 20 శాతం వరకూ పెంచేందుకు అనుమతించాలంటూ ఔషధ తయారీ సంస్థలకు చెందిన ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
షెడ్యూల్డ్ ఔషధాల జాబితాలోని మందుల ధరల్ని ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయిస్తుంది. ఇది నిర్ణయించిన గరిష్ఠ ధరల ఆధారంగానే ఫార్మా కంపెనీలు వీటిని విక్రయించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరల సవరణకు డబ్ల్యూపీఐని ఆధారంగా చేసుకుంటామని, ఇటీవల డబ్ల్యూపీఐ జోరుగా పెరిగినందున, ఔషధ ధరల్ని కూడా ఇందుకు అనుగుణంగా సవరించనున్నట్టు ఎన్పీపీఏ అధికారులు వివరించారు. కొత్త ధరలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. సాధారణ జ్వరాలకు వాడే పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి యాంటిబయోటిక్స్, రక్త హీనతకు వాడే ఫోలిక్యాసిడ్, ఇతర విటమిన్, మినరల్స్ తదితరాల ధరలు పెరగనున్నాయి. కొవిడ్-19 రోగులకు ఉపయోగించే ప్రిడెనిసొలొన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.