Price hike | స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే, వెంటనే ఆయా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లండి. రాబోయే రోజు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ముఖ్యమైన విడిభాగాల ధరలు మార్కెట్లో వేగంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ధర పెరుగుదల కారణంగా.. తయారీదారులు తమ కొత్త స్మార్ట్ టీవీ సెట్ల ధరలను పెంచబోతున్నారు. పెద్ద స్క్రీన్ టీవీల ధరల ప్రభావం కనిపించనున్నది. టీవీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగం టెలివిజన్ మొత్తం ఖర్చులో దాని వాటా 60 నుంచి 65 శాతం ఉంటుందని, ఓపెన్ సేల్ ధరలు సగటున 15 శాతం పెరిగాయని స్మార్ట్ టీవీల తయారీదారులు పేర్కొంటున్నారు.
ఓపెన్ సేల్ ధరల పెరుగుదల కారణంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ 2022లో ఓపెన్ సెల్స్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. కానీ, 2023 ప్రారంభం నుంచి పెరుగుతోందని చెప్పారు. జనవరి నుంచి జూన్ వరకు వీటి ధరలు 15 నుంచి 17 శాతం పెరిగాయి. 32 ఇంచుల టీవీలో ఉపయోగించే ఓపెన్ సెల్ ఒక్కో ప్యానెల్కు దాదాపు 27 డాలర్ల వరకు ఖర్చవుతున్నది. అయితే, ధరల్లో సగటు పెరుగుదల 15 శాతం రేంజ్లో ఉండనున్నది. ప్రపంచంలోని చాలా ఓపెన్ సెల్ ప్యానెల్స్ 4 నుంచి 5 చైనీస్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధర పెరుగుదల ప్రభావం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలలో కనిపించనున్నది.
దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు స్మార్ట్ టీవీల ధరలను పెంచబోతున్నాయి. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల వ్యాపారులు ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, ఇప్పటివరకు దాని ధర 25 నుంచి 30శాతం పెరిగిందని పేర్కొంటున్నారు. దాంతో పాటు కొరత సైతం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీ కంపెనీలు వాటి ధరలను పెంచబోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ బ్రాండ్ల టెలివిజన్ల ధర కూడా 10శాతం వరకు పెరిగింది. ఓపెన్ సేల్ ధరలు పెరుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదల రాబోయే పండుగ సీజన్ వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఓపెన్ సేల్ ధరలు పెరగడంతో వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఎందుకంటే రిటైలర్లు తమ వద్ద 30 నుంచి 60 రోజుల స్టాక్ ఉంటుంది. ధరల పెరుగుదల ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనిపించనుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం
నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలిపారు. స్మార్ట్ఫోన్స్, టీవీల విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా పెరిగిన ధర నుంచి కొంత వరకైనా ఊరటనిచ్చేందుకు ప్రయత్నాలు చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికశాఖ టీవీ ప్యానెళ్లలోని కొన్ని ఓపెన్ సెల్ భాగాలపై ప్రైమరీ దిగుమతి సుంకాన్ని 5శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.