ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26: కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అధికారులను ఆదేశించారు. లాలాపేట యూపీహెచ్సీ, తుకారాంగేట్ యూపీహెచ్సీలను ఆమె సోమవారం సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో రద్దీ తీవ్రంగా ఉంటున్నదని చెప్పారు. దీనిపై సంబంధిత వైద్యాధికారులు డాక్టర్ రమేశ్, డాక్టర్ రాజశ్రీలతో మాట్లాడిన ఆమె.. వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లు సకాలంలో రావడం లేదని తెలుసుకుని డీఎంహెచ్ఓతో మాట్లాడి వెంటనే తెప్పించారు. ప్రతిరోజూ టోకెన్ల ద్వారా 50 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారని, ఈ సంఖ్య తెలియకపోవడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో ఇబ్బంది తలెత్తుతున్నదని వివరించారు. ప్రతిరోజూ ఏ సమయం నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నారు ? ఎంత మందికి ఇవ్వబోతున్నారు.. అనే విషయాలను పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.