Home Loans | ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలు సహా వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన వడ్డీరేట్లు మంగళవారం (2022 నవంబర్ ఒకటో తేదీ) నుంచి అమల్లోకి వచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 30 బేసిక్ పాయింట్లు పెంచేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సైతం ఆల్ టెన్యూర్ లోన్లపై 15 బేసిక్ పాయింట్లు పెంచింది.
ఏడాది టెన్యూర్ గల రుణంపై వడ్డీరేటు 7.75 నుంచి 8.05 శాతానికి పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పీఎన్బీ తెలిపింది. ఓవర్ నైట్ నుంచి మూడేండ్ల గడువు గల రుణాలపై వడ్డీరేట్లు 7.40 నుంచి 8.35 శాతం మధ్య పెరిగాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఏడాది గడువు గల రుణంపై ఎంసీఎల్ఆర్ 7.80 నుంచి 7.95 శాతానికి పెరిగింది. ఇతర టెన్యూర్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ పది బేసిక్ పాయింట్ల చొప్పున పెరగడంతో 7.05 శాతం నుంచి 8.10శాతం మధ్య పెరిగాయి.