మారుతి, హీరో తదితర 75 సంస్థలకు ప్రోత్సాహకాలు
జాబితాలో బీహెచ్ఈఎల్ కూడా ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 15: ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను పొందడానికి 75 సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కుమ్మిన్స్, టయోట కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితర సంస్థలున్నట్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కొత్తగా నాన్-ఆటోమోటివ్ ఇన్వెస్టర్ (కంపోనెంట్) కంపెనీలైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), సియెట్ లిమిటెడ్ కూడా వీటిలో ఉన్నట్టు వివరించింది. కాగా, కంపోనెంట్ చాంపియన్ ప్రోత్సాహక పథకం కింద ఈ 75 ఆమోదిత దరఖాస్తుదారుల నుంచి ప్రతిపాదిత రూ.29,834 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. అంతకుముందు కూడా 20 దరఖాస్తుదారులను చాంపియన్ ఓఈఎం ప్రోత్సాహక పథకం కింద కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. రెండు కంపోనెంట్స్ సంస్థలు పీఎల్ఐ పథకంలో భాగంగా ఉన్నాయి. దేశీయంగా అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల తయారీకి ఆటో రంగ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చేలా ఈ పథకం 18 శాతం వరకు ప్రోత్సాహకాలను అందిస్తుంది.
జోరుగా పెట్టుబడులు
దేశీయ ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్ పరిశ్రమకు ఈ పీఎల్ఐ పథకం పెద్ద ఎత్తునే లాభించింది. పీఎల్ఐ పథకం ప్రకటన నేపథ్యంలో ఆటో రంగంలోకి ఐదేండ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రూ.74,850 కోట్ల పెట్టుబడులను ఈ పథకం ఆకర్షించింది. ఇందులో ప్రతిపాదిత రూ.45,016 కోట్ల పెట్టుబడులు చాంపియన్ ఓఈఎం ప్రోత్సాహక పథకం కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారుల నుంచే ఉన్నాయి. మరో రూ.29,834 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు కంపోనెంట్ చాంపియన్ ప్రోత్సాహక పథకం కింద తాజాగా ఆమోదించిన దరఖాస్తుదారుల నుంచి ఉన్నట్టు మంగళవారం ఓ అధికారిక ప్రకటన తెలిపింది.
విదేశీ సంస్థలకూ..
భారతీయ సంస్థలతోపాటు పలు విదేశీ సంస్థలకూ పీఎల్ఐ ప్రోత్సాహకాలు అందుతున్నాయి. జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ వంటి దేశాల ఆటో రంగ సంస్థలకూ ఈ పథకం లాభిస్తున్నది. ఇప్పటికే ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్ తయారీ వ్యాపారంలో ఉన్న సంస్థలకు, ఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న మదుపరుల కోసమే ఈ పీఎల్ఐ పథకాన్ని తెచ్చారు. ఇక చాంపియన్ ఓఈఎం ప్రోత్సాహక పథకం అనేది ‘సేల్స్ వాల్యూ ఆధారిత’ పథకం. అన్ని రకాలైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది.
‘పీఎల్ఐ పథకానికి పరిశ్రమ నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రపంచ శ్రేణి తయారీ సంస్థలు భారత్కు రావాలని ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగం త్వరలోనే గణనీయంగా పెరుగుతుంది. తద్వారా తయారీ రంగం మరింత బలపడుతుంది’
–మహేంద్రనాథ్ పాండే, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి
‘పీఎల్ఐ పథకం కింద 75 ఆటో కంపోనెంట్ తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఆమోదించడం ఆయా సంస్థల ఎదుగుదలకు ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. సంప్రదాయ పరిశ్రమ నుంచి చలన పరిశ్రమకు ఆటో రంగం మారడంలో ఈ ప్రోత్సాహకాలు ఎంతో దోహదం చేయగలవు’ –సంజయ్ జే కపూర్, ఏసీఎంఏ అధ్యక్షుడు