Indian Railways | తరుచుగా రైలు ప్రయాణం చేసేవారు ఒక్కోసారి టికెట్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఇలా ప్రతి రోజూ వేల మంది ప్రయాణికులు ‘వెయిటింగ్ లిస్ట్’లో ఉండటంతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేంద్రం, భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వచ్చే 15 ఏండ్లలో రూ.లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లు కొనుగోలు భారతీయ రైల్వే నిర్ణయించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత పాత రైళ్ల స్థానంలో కొత్తగా దాదాపు ఏడెనిమిది వేల రైళ్లు కొనుగోలు చేసేందుకు నాలుగైదేండ్లలో టెండర్లు పిలుస్తామన్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ తల పోస్తున్నది. ఇందుకోసం రైళ్ల సంఖ్య పెంచడంతోపాటు ట్రాక్లు, భద్రతాపరమైన టెక్నాలజీని మెరుగు పర్చనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,754 ట్రిప్పుల రైలు ప్రయాణాలు సాగుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ తగ్గించడానికి రోజూ మరో మూడు వేల టిప్పులు పెంచాలని యోచిస్తున్నది. వచ్చే ఏడేండ్లలో రైలు ప్రయాణికుల సంఖ్య వెయ్యి కోట్లకు చేరుతుందని రైల్వేశాఖ భావిస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖకు కేటాయించిన రూ.2.4 లక్షల కోట్ల బడ్జెట్లో 70 శాతం నిధులు వినియోగించామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశవ్యాప్తంగా 6,000 కి.మీ విస్తీర్ణం మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 14 కి.మీ పొడవునా ట్రాక్ నిర్మాణం చేపడితే, ప్రస్తత ఆర్థిక సంవత్సరంలో సరాసరి 16 కి.మీ పొడవునా ట్రాక్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.