Human Trafficking | భారతీయులతోపాటు 300 మందికి పైగా ప్రయాణికులతో కూడిన విమానం మంగళవారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో ప్రయాణిస్తున్న వారు హ్యుమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఫ్రాన్స్ అధికారులు మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు రావాల్సి ఉంది. రొమేనియా లెజెండ్ ఎయిర్ లైన్స్ నిర్వహిస్తున్న ఏ340 విమానం పారిస్ నగరానికి సమీపంలోని వట్రీ నుంచి బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంటకు ముంబైకి చేరుతుందని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి.
నికరాగువ కేంద్రంగా ప్రయాణిస్తున్న విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ నుంచి టేకాఫ్ అయ్యింది. ఇందులో 303 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో అత్యధికులు భారతీయులే. కానీ వారు హ్యుమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న అనుమానాలపై పారిస్ నగరానికి 150 కి.మీ దూరంలోని వట్రీలో ఆ విమానాన్ని గ్రౌండ్ చేశారు. ప్రయాణికుల్లోని 11 మంది మైనర్ల వెంట వారి సంరక్షకులు లేకపోవడం గమనార్హం.
ఆదివారం అరెస్ట్ చేసిన ప్రయాణికులను నలుగురు ఫ్రాన్స్ న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ ప్రయాణికుల్లో కొందరు హిందీ, మరి కొందరు తమిళం, తదితర భాషల్లో మాట్లాడారని ఫ్రాన్స్ మీడియా పేర్కొంది. విచారణలో అవకతవకల నేపథ్యంలో ప్రయాణికుల విచారణను రద్దు చేస్తూ.., సదరు విమానం బయలుదేరేందుకు న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు.