Petrol Rates | దేశంలో కేంద్ర చమురు సంస్థలు మరోమారు ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర 35 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.84, లీటర్ డీజిల్ ధర రూ. 94.57లకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.77, డీజిల్ రూ.102.52లకు దూసుకెళ్లింది. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో ముంబైలోనే గరిష్ఠంగా ఉంది.
ఇప్పటికే పలు రాష్ట్ర రాజధానుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. ఇక హైదరాబాద్లో రూ.110 మార్క్ను అధిగమించింది. దేశంలో పలు ప్రాంతాల్లో లీటర్ డీజిల్ ధర కూడా సెంచరీ మార్క్ దాటింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.109.53, డీజిల్ రూ.100.37, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09, డీజిల్ ధర రూ.103.18 పలుకుతోంది,
పెట్రోల్, డీజిల్ ధరలు శరవేగంగా పెరుగుతుండటంతో వాటి ధరల మధ్య వ్యత్యాసం కూడా తగ్గుతున్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, కేరళ, కర్ణాటక, లడఖ్ల్లో డీజిల్ లీటర్ ధర రూ.100 మార్క్ దాటింది. రాష్ట్రాల వారీగా వ్యాట్, ఇతర పన్నులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి.