Petrol Rates | వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ముచ్చటగా మూడో సారి విజయం ద్వారా ‘హ్యాట్రిక్’ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర చమురు ఉత్పత్తుల ధరలు తగ్గిస్తారని సమాచారం. లీటర్ పెట్రోల్/డీజిల్పై రూ.4-6 మధ్య తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు విషయమై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర చమురు సంస్థలకు మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ధర తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు సమానంగా భరించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ / డీజిల్ మీద రూ.10 వరకూ ధర తగ్గించాలని యోచిస్తున్నది. గత మూడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70-80 డాలర్ల మధ్యే తచ్చాడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దిగి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయి 5.55 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కేంద్ర ముడి చమురు సంస్థలతో ఆర్థిక, చమురు మంత్రిత్వశాఖలు ఇటీవలే సంప్రదింపులు పూర్తి చేసి, ప్రధానమంత్రి కార్యాలయాని (పీఎంఓ)కి ఆప్షన్లు సమర్పించినట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు విషయమై గత 15 రోజులుగా ఈ రెండు శాఖలు చర్చలు జరుపుతున్నాయి.
ఇంతకుముందు 2021 నవంబర్, 2022 మే లో .. రెండు దఫాలుగా లీటర్ పెట్రోల్ మీద రూ.13, లీటర్ డీజిల్ మీద రూ.16 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దీంతో రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త రిలీఫ్ కల్పించాయి. తాజాగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర తక్కువగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర చమురు సంస్థలు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భారీ లాభాలు గడించనున్నాయి.