Nirmala on Excise Duty | పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు విషయమై విపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఇంధన ధరల్లో సుంకం తగ్గింపు భారం మొత్తం కేంద్రమే భరిస్తుందన్నారు. లీటర్ పెట్రోల్పై రూ.8, లీటర్ డీజిల్పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు శనివారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల విమర్శలకు ట్విట్టర్ వేదికగా నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రజల ప్రయోజనార్థం పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం అని ట్వీట్ చేశారు.
బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (బీఈడీ), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ), రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్ఐసీ), అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) కలిస్తేనే పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం అని పేర్కొన్నారు. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్ఐసీ) కింద వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గత నవంబర్లో కేంద్రం తగ్గించిందన్నారు. 2021 నవంబర్ 21, 2022 మే 21ల్లో విధించిన ఎక్సైజ్ సుంకంలో కోత భారం మొత్తం కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్రాలకు పంచి ఇచ్చే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (బీఈడీ) యధాతథంగా కొనసాగుతుందన్నారు.
శనివారం కోత విధించిన ఎక్సైజ్ సుంకం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. లక్ష కోట్లు, నవంబర్లో విధించిన కోత వల్ల రూ.1.20 లక్షల కోట్ల మేరకు ఆదాయం గండిపడుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2014-22 మధ్య మోదీ సర్కార్ రూ.90.0 లక్షల కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు చేసిందన్నారు. 2004-14 మధ్య యూపీఏ సర్కార్ కేవలం రూ.49.2 లక్షల కోట్లు మాత్రమే అభివృద్ధికి ఖర్చు చేసిందని ఆరోపించారు. మొత్తం ఖర్చుల్లో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ కోసం మోదీ సర్కార్ రూ.24.85 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, యూపీఏ సర్కార్ కేవలం రూ.13.9 లక్షల కోట్లు వెచ్చించిందని సెలవిచ్చారు.