హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తమ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సీకో ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో సంస్థ ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్లో సమావేశమయ్యారు. విస్తరణ ప్రణాళికలపై మంత్రితో ఆ సంస్థ కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాబర్టో అజేవేడో చర్చించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రం గా పెప్సీకో నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ను మరింతగా విస్తరించి కార్యకలాపాలను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. కేవలం 250 మందితో 2019లో ప్రారంభమైన ఈ సెంటర్లో ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 4వేలకు పెంచబోతున్నట్టు పెప్సీకో చెప్పడం గమనార్హం. అంతేగాక ఏడాదిలో ఈ అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామనడం విశేషం. ఇందుకు సంబంధించిన పెట్టుబడులను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
హైదరాబాద్ టు గ్లోబల్..
గ్లోబల్ సేవలను హైదరాబాద్ నుంచే అందిస్తామని అజేవేడో అన్నారు. మానవ వనరుల డిజిటలైజేషన్, ఆర్థిక సేవల వంటి ప్రధానమైన అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందని వివరించారు.
కేటీఆర్ హర్షం..
పెప్సీకో నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పెప్సీకో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ, సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర విభాగాలు, రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని పెప్సీకో ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణలో అపార అవకాశాలున్నాయని, ఇప్పటికే అనేక ప్రఖ్యాత సంస్థలు ఆహార ఉత్పత్తుల తయారీలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. పెప్సీకో కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలు, కార్యక్రమాలను పెప్సీకోకు మంత్రి కేటీఆర్ వివరించడంతో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంస్థ ఆసక్తిని వ్యక్తం చేసింది.