ఆరోగ్యం, ఆహార అవసరాలకు పెరుగుతున్న ఇంధన ధర సెగ: ఎస్బీఐ
ముంబై, జూలై 13: పెరుగుతున్న ఇంధన ధరలు.. ప్రజల ఆహార, ఆరోగ్య బడ్జెట్పై ప్రభా వం చూపిస్తున్నాయని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. పెట్రో భారం వల్ల కిరాణా, ఆరోగ్యం, ఇతరత్రా అవసరాల కోసం పెట్టే ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ.100 మార్కును దాటేయగా, డీజిల్ రేటు సైతం రూ.100కు సమీపిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో సంపాదనలో ఇంధన కొనుగోళ్లకే ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నదని, ఫలితంగా సామాన్య ప్రజానీకం అత్యవసర వినియోగపు వ్యయాన్ని తగ్గించుకుంటున్నారని మంగళవారం ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. ఎస్బీఐ కార్డు వినియోగం తీరుతెన్నులను గమనిస్తే ఇది తేటతెల్లమైందన్నారు. నిజానికి పెట్రో ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికీ దారి తీస్తుందని, ఇప్పటికే ఇది ఆర్బీఐ లక్ష్యాన్ని మించి ఉన్నదన్నారు.
పన్నుల తగ్గింపు అవసరం
పెట్రో ధరలు రికార్డు స్థాయిలో కదలాడుతున్న నేపథ్యంలో పన్నుల తగ్గింపును కేంద్రం తప్పక పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఘోష్ అభిప్రాయపడ్డారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ.40కిపైగా కేంద్ర, రాష్ర్టాల పన్నులు, ఎక్సైజ్ సుంకాల భారమే కనిపిస్తున్నదన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా పన్నులు పెరుగుతున్నాయని, కానీ అక్కడ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ మాత్రం ట్యాక్స్ల భారం దిగట్లేదని వ్యాఖ్యానించారు. ఇక కరోనా మహమ్మారి అంతం.. వ్యాక్సినేషన్ వేగంతోనేనని అన్నారు.