Pee-Gate | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం షాక్ ఇచ్చింది. ఇటీవల రెండు వేర్వేరు విమానాల్లో మద్యం మత్తులో ఇద్దరు ప్రయాణికులు సహచర ప్రయాణికులపై మూత్రం పోసిన ఘటనలు వెలుగుచూశాయి.
బాధితుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలపై సమాధానం చెప్పాల్సిందిగా ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. డీజీసీఏ జారీ చేసిన నోటీసుపై ఎయిర్ ఇండియా స్పందించాల్సి ఉంది.
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు.. ఖాళీగా ఉన్న సీటుపైనా, మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్ మీద మూత్రం పోశాడు. మద్యం మత్తులో ఉన్న సదరు ప్రయాణికుడు విమానం లావెట్రీలో సిగరెట్ తాగుతుండగా సిబ్బంది పట్టుకున్నారు.
న్యూయార్క్-న్యూఢిల్లీ మధ్య గత నవంబర్ 26న ప్రయాణిస్తున్న విమానం బిజినెస్ క్లాస్లో ఉన్న వృద్ధ మహిళపై మద్యం మత్తులో మూత్రం పోశాడు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏకు ఎయిర్ ఇండియా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
న్యూయార్క్-న్యూఢిల్లీ విమాన ఘటనపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మరింత వేగంగా చర్య తీసుకోలేకపోయామని, ఇది తనకు, తమ ఎయిర్ ఇండియా సిబ్బందికి వేదన కలిగించిందని పేర్కొన్నారు.