Paytm’s IPO Hurdles | ఆన్లైన్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఐపీవో గట్టి అవరోధం ఎదురు కానున్నది. సంస్థ సహ వ్యవస్థాపకుడినంటూ అశోక్ కుమార్ సక్సేనా (71) అనే వ్యక్తి దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదు చేశారు. 2.2 బిలియన్ల డాలర్ల నిధులను సేకరించాలన్న లక్ష్యంతో పేటీఎం ప్రతిపాదించిన ఐపీవోను నిలిపివేయాలని కోరారు. రెండు దశాబ్దాల క్రితం పేటీఎం సహ వ్యవస్థాపకుడిగా తాను 27,500 డాలర్లు పెట్టుబడులు పెట్టానని, కానీ ఇప్పటి వరకు తనకు షేర్లు కేటాయించలేదని పేర్కొన్నారు. పేటీఎం అశోక్ కుమార్ సక్సేనా ఆరోపణలను కొట్టి పారేసింది. సక్సేనా ఆరోపణలు పేటీఎంకు అడ్డంకులు కల్పించడానికేనని పేర్కొంది.
పేటీఎం ప్రకటనను అశోక్ కుమార్ సక్సేనా తిరస్కరించారు. పేటీఎం ప్రస్తుతం హై ప్రొఫైల్ స్థానంలో ఉందని, తన వంటి ప్రైవేట్ వ్యక్తి ఆ సంస్థకు అడ్డంకులు స్రుష్టించే స్థానంలో తాను లేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
మోసపూరితంగా వ్యవహరిస్తున్న పేటీఎం ఐపీవోను అనుమతిస్తే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కోల్పోవాల్సి వస్తుందని సెబీకి చేసిన ఫిర్యాదులో వెల్లడించారు.
తాజా వివాదం నేపథ్యంలో రెగ్యులేటరీ విచారణలతో పేటీఎం ఐపీవో జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇన్ గవర్న్ అనే అడ్వైజరీ సంస్థ వాటాదారు శ్రీరాం సుబ్రమణ్యం అన్నారు.
అదే సమయంలో తాజా వివాదం వల్ల కంపెనీకి గానీ, వాటాదారులకు గానీ ఎటువంటి నష్టం వాటిల్లబోదని సెబీకి పేటీఎం యాజమాన్యం హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
తాజా వివాదం నేపథ్యంలో ఇతర వాటాదారులైన ఆలీబాబా, సాఫ్ట్ బ్యాంక్ నుంచి పేటీఎంకు సమస్యలు పెంచి ఉన్నాయని తెలుస్తున్నది.
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు, అశోక్ కుమార్ సక్సేనాకు మధ్య 2001లో కుదిరిన ఒక పేజీ ఒప్పంద పత్రం ఈ వివాదానికి కేంద్రంగా కనిపిస్తున్నది.
పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో సక్సేనాకు 55 శాతం వాటా, మిగతా విజయ్ శేఖర్ శర్మకు కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై పేటీఎం గానీ, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ గానీ స్పందించలేదు.
పేటీఎం సమర్పించిన పత్రాల ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ ప్రకారం 2000-04 మధ్య సంస్థ డైరెక్టర్లలో ఒకరు అశోక్ కుమార్ సక్సేనా అని ఉంది.
పోలీసులకు ఇచ్చిన నివేదికలో పేటీఎం పేరెంట్ సంస్థ తొలి డైరెక్టర్లలో ఆయన ఒకరని అంగీకరిస్తున్నది. కానీ ఆయన క్రమంగా తన హక్కులను వదులుకున్నారని చెబుతున్నది.
2003-04 మధ్య తమ సంస్థ షేర్లను ఇండియన్ సంస్థకు బదిలీ అయ్యాయని పేటీఎం వాదించింది. సంస్థ యాజమాన్యంతో అశోక్ కుమార్ సక్సేనా ప్రైవేట్గా అవగాహనకు వచ్చారని వాదిస్తున్నది.
కానీ ఈ వాదననూ సక్సేనా కొట్టి పారేస్తున్నారు. తాను ఎటువంటి షేర్లను అందుకోలేదని, ఏ ప్రైవేట్ ఒప్పందం చేసుకోలేదన్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న అశోక్ కుమార్ సక్సేనా తన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నానని చెప్పారు. పేటీఎంలో పెట్టుబడుల పత్రాలు గత వేసవిలో దొరికాయని పేర్కొన్నారు. షేర్లు, మనీ ఒక అంశం అని, కానీ, తనను సహ వ్యవస్థాపకుడిగా గుర్తించాలని కోరారు.
ప్రస్తుతం ఈ వివాదం ఢిల్లీ కోర్టుకు చేరుకున్నది. దీనిపై ఢిల్లీ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించాలని గత నెలలో న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ నెల 23 లోగా ప్రతిస్పందించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.