Paytm Layoffs | పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పొదుపు చర్యలు చేపట్టింది. ఆదా చర్చల్లో భాగంగా ఇటీవల 1000 మందిని తొలగించిన పేటీఎం.. తాజాగా సుమారు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పేటీఎం తన కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సొల్యూషన్స్ అమలుపై కేంద్రీకరించడం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణం అని సమాచారం. హెచ్ఆర్ విభాగం అధికారులు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒక్కొక్కరిని పిలిచి తొలగిస్తున్నట్లు చెబుతున్నారని పేటీఎం ఉద్యోగులు చెబుతున్నారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు మరి కొన్ని గంటల్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ ఐదు శాతం పతనమైంది. మూడు రోజుల్లో మూడో లోయర్ సర్క్యూట్ ఇది. థర్డ్ పార్టీ పేమెంట్ యాప్గా అనుమతించాలని పేటీఎం పెట్టుకున్న దరఖాస్తును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పరిశీలిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ షేర్ పతనం కావడం గమనార్హం. బీఎస్ఈలో పేటీఎం స్టాక్ 4.98 శాతం పతనమై రూ.334.35 వద్ద స్థిర పడింది. నాలుగు రోజుల్లో 17 శాతం నష్టపోయింది. గత అక్టోబర్ లో రూ.998.30 వద్ద 52 -వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసిన పేటీఎం.. ఇప్పుడు 66.50 శాతం పతనమైంది.