న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్పై రిజర్వ్బ్యాంక్ నిషేధం విధించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తక్షణమే డిపాజిట్ల సేకరణను నిషేధించడంతో పాటు పరపతి లావాదేవీల నిర్వహణ, కస్టమర్ ఖాతాలకు టాప్అప్లు ఇవ్వడం, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాలెట్లు, కార్డులు జారీచేయడం తదితర పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) నిర్వహించే కార్యకలాపాలను ఈ నెల 29 తర్వాత చేపట్టరాదని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం ఆ బ్యాంక్ ఖాతాదారులు ప్రస్తుత డిపాజిట్లను తీసుకోవడం, వారి వ్యాలెట్లలో నిల్వ ఉన్న సొమ్ముద్వారా చెల్లింపులు జరపడం ఫిబ్రవరి 29 వరకే చేయగలుగుతారు. అలాగే పీటీఎం వ్యాలెట్లోకి టాప్అప్ నిలిచిపోతుంది. దాని ద్వారా ఎటువంటి లావాదేవీలు జరగవు.
పీపీబీఎల్లో కేవైసీని పాటించని ఖాతాలు లక్షల్లో ఉన్నాయని, వేలాది కేసుల్లో పలు ఖాతాల్ని ఓపెన్ చేయడానికి ఒకే పాన్ నంబర్ను ఉపయోగించారని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రీ-పెయిడ్ సాధనాల ద్వారా రెగ్యులేటరీ పరిమితులకు మించి కోట్లాది రూపాయిల లావాదేవీలు జరిగిన ఉదంతాలు ఉండటంతో మనీలాండరింగ్ జరిగిందన్న ఆందోళనలు ఏర్పడినట్టు ఆ వర్గాలు వివరించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు 35 కోట్ల ఈ-వ్యాలెట్లు ఉండగా, అందులో 31 కోట్లు అరుదుగా లావాదేవీలు జరిగే డోర్మాంట్ వ్యాలెట్లని, కేవలం 4 కోట్ల వ్యాలెట్లు మాత్రమే బ్యాలెన్స్ లేకుండా లేదా అతితక్కువ బ్యాలెన్స్తో నడుస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అసాధారణంగా అధిక సంఖ్యలో డోర్మాంట్ ఖాతాలు ఉన్నాయంటే, వాటిని మనీలాండరింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలు తలెత్తుతాయని అన్నారు. కేవైసీ పాటింపులలో అవతతవకలు జరిగినట్టు తెలుస్తున్నదని, ఇందుకు సంబంధించిన తీవ్ర ఉల్లంఘనల్ని 2021లో ఆర్బీఐ కనుగొని, ఈ లోటుపాట్లను సరిచేయాలని బ్యాంక్ను ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ అవి కొనసాగాయని, ఈ అంశమై బ్యాంక్ సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని, పలు సందర్భాల్లో తప్పులు తడకలుగా తేలాయని పేర్కొన్నాయి. దీంతో 2022 మార్చి నుంచి కొత్త ఖాతాదారులను తీసుకోకుండా పీపీబీఎల్పై ఆర్బీఐ నియంత్రణలు విధించడంతో పాటు సిస్టమ్ను సమగ్రంగా అడిట్ చేసేందుకు ఒక ఆడిటింగ్ సంస్థను సైతం నియమించింది. డిజిటల్ మోసాలకు ఉపయోగిస్తున్న అటువంటి పలు ఖాతాల్ని సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు స్తంభింపచేసాయి. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్లో పీపీబీఎల్, దాని మాతృసంస్థ 97 కమ్యూనికేషన్స్, ఇతర పేమెంట్ అగ్రిగేటర్ల ఆవరణల్లో ఈడీ దాడుల్ని నిర్వహించింది.
పేటీఎం కస్టమర్లకు స్వాగతం పలుకుతున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వ్యాఖ్యానించారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లైసెన్స్లను రిజర్వుబ్యాంక్ రద్దు చేసే అవకాశాలుండటంతో సంస్థకు సంబంధించిన ఖాతాదారులకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జనవరి 31న పేటీఎం పేమెంట్ బ్యాంక్పై రిజర్వు బ్యాంక్ కొరడా ఝులిపించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు సేకరించకూడదని, అలాగే వాలెట్లు, ఫాస్టాగ్, ఇతర సర్వీసులను ఈ నెల 29 నుంచి నిలిపివేయాలని ఆదేశించింది.
నిధులు మళ్లించినట్టు తాజా ఆరోపణలేవైనా వస్తే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఈడీ దర్యాప్తు చేస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. మరోవైపు ఈ బ్యాంక్ లైసెన్సును రద్దుచేయాలన్న అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నదని బ్లూంబర్గ్ వార్తా సంస్థ శనివారం తెలిపింది. రిజర్వ్బ్యాంక్ ముందుగా డిపాజిటర్లను పరిరక్షించాలని కోరుకుంటున్నదని, ఫిబ్రవరి 29 గడువు ముగిసిన తర్వాత తీవ్ర చర్య తీసుకుంటుందని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ బ్లూంబర్గ్ తెలిపింది.