న్యూఢిల్లీ, మార్చి 15: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎంపై వస్తున్న పలు ప్రతికూల వార్తలతో ఆ షేరు కుదేలవుతున్నది. మంగళవారం బీఎస్ఈలో పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో 12 శాతంపైగా పతనమై రికార్డు కనిష్ఠస్థాయి రూ. 589 వద్ద ముగిసింది. క్రితం రోజు ఈ షేరు 13 శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వర్ల ద్వారా చైనా సంస్థకు సమాచారం షేర్ అవుతున్నట్టు రిజర్వ్బ్యాంక్ తన వార్షిక తనిఖీల్లో గుర్తించిందని, దాంతో పేటీఎంపై నియంత్రణలు విధించిందంటూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. వెనువెంటనే ఈ మీడియా వార్తల్ని పేటీఎం ఖండించినప్పటికీ షేరు పతనానికి బ్రేక్ పడలేదు. డేటా లోకలైజేషన్కు సంబంధించి పూర్తిగా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నడుస్తున్నదని, బ్యాంక్ డేటా అంతా ఇండియాలోనే ఉంటుందంటూ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో గమనించిన కొన్ని పర్యవేక్షణా ఆందోళనల కారణంగా కొత్త ఖాతాలు తెరవకూడదంటూ సంస్థను ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలతో ప్రస్తుత ఖాతాదారులపై ఎటువంటి ప్రభావం పడదని, యథావిధిగా వారు బ్యాంకింగ్, పేమెంట్ సర్వీసుల్ని పొందవచ్చని పేటీఎం తెలిపింది.
70 శాతం సంపద కోల్పోయిన ఇన్వెస్టర్లు
పేటీఎం ఆరు నెలల క్రితం రూ.2,150 ధరతో ఐపీవో జారీచేసింది. రూ. 1.10 లక్షల కోట్ల మార్కెట్ విలువతో షేరు రూ. 1,961 వద్ద లిస్టయ్యింది. తాజాగా దీని మార్కెట్ విలువ రూ. 40,000 కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ నాటి నుంచి పేటీఎంలో పెట్టుబడి ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఇప్పటివరకూ రూ. 70,000 కోట్ల మేర కరిగిపోయింది.
విశ్లేషకులు ఏమంటున్నారు?
పేటీఎం, జొమాటో, వంటి నవతరం టెక్ కంపెనీలు ప్రస్తుత వ్యాపారం కాకుండా, భవిష్యత్ వ్యాపార వృద్ధి అంచనాలతో అధిక విలువల్లో ట్రేడవుతున్నాయని ప్రొఫిసియంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు మనోజ్ దాల్మియా చెప్పారు. ఇటువంటి షేర్లకు ఇన్వెస్టర్ల పెట్టుబడిలో కొద్ది మొత్తమే కేటాయించాలని సూచించారు. బుల్లిష్ ధోరణి ఏర్పడితే వచ్చే ఆరునెలల్లో ఇది రూ. 920-1,000 వరకూ పెరగవచ్చని, బేరిష్గానే కొనసాగితే రూ.600-680 శ్రేణికి పరిమితం కావొచ్చని పేటీఎం షేరుపై ఆయన అంచనాల్ని వ్యక్తం చేశారు. పేటీఎంపై ఆర్బీఐ నియంత్రణలు ఎక్కువకాలం కొనసాగితే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మరింత ఇబ్బంది ఎదురవుతుందని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ అన్నారు. దీర్ఘకాలిక దృష్టితో ఓపిగ్గా ఐదేండ్లకుపైగా ఎదురుచూడగలిగితే ఇన్వెస్టర్లు వారి రిస్క్ మూలధనంలో 7 శాతం వరకూ ఇటువంటి షేర్లలో పెట్టుబడి చేయవచ్చని సింఘాల్ సిఫార్సుచేశారు. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఇటీవల ఆర్బీఐ విధించిన నియంత్రణలతో దీని వ్యాపార సెంటిమెంట్స్ దెబ్బతింటాయని, తక్షణ ప్రభావం ప్రతికూలంగానే ఉంటుందని షేర్ ఇండియా రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అన్నారు.