న్యూఢిల్లీ, మార్చి 14: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తనవద్దనున్న డాటాను చైనా కంపెనీలతో షేర్ చేసినందుకే, ఆ సంస్థపై రిజర్వ్బ్యాంక్ చర్యలు తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేటీఎం సర్వర్లు సమాచారాన్ని చైనా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలకు చేరవేస్తున్నట్టు ఆర్బీఐ వార్షిక తనిఖీ నివేదికలో వెల్లడిఅయినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 11 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించింది. విదేశాల్లోని సర్వర్లకు సమాచారం పంపడం నిబంధనలకు విరుద్ధమని, అలాగే పేటీఎం తన కస్టమర్లను సరిగ్గా వెరీఫై చేయడం లేదని ఆర్బీఐ గమనించినట్టు వివరించాయి.
విజయ్ శేఖర్ శర్మ వివరణ..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డాటా దేశంలోగానీ, విదేశాల్లోగానీ ఇతర సర్వర్లకు షేర్అవుతున్నట్లు తమతో ఆర్బీఐ ప్రస్తావించలేదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే పేటీఎం యాజమాన్యంపై ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయలేదన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో శర్మకు 51 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా పేటీఎం నిర్వాహక సంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్స్ వద్ద ఉంది. ఆర్బీఐ చర్యలు, డేటా షేరింగ్ వార్తలతో ఈ షేరు సోమవారం 13 శాతం పతనమై రూ.675 వద్ద ముగిసింది.