జూన్లో జోరుగా ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు
మెరుగుపడిన చిప్ సరఫరా: ఆటోమొబైల్ డీలర్లు
న్యూఢిల్లీ, జూలై 5: దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు మళ్లీ పట్టాలెక్కాయి. గత నెలలో ఆటో సేల్స్ జోరుగా సాగినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూన్లో 40 శాతం వాహన విక్రయాలు పెరిగాయని ఆటో డీలర్ల సంఘం మంగళవారం చెప్పింది. ముఖ్యంగా ఎస్యూవీలకు ఆదరణ విశేషంగా ఉందన్న ఎఫ్ఏడీఏ.. డిమాండ్కు తగ్గట్టుగా సెమీకండక్టర్ల (చిప్) సరఫరా జరుగుతున్నట్టు వెల్లడించింది. ఇక ఈసారి ద్విచక్ర వాహన విక్రయాలు 20 శాతం పెరగగా, వాణిజ్య వాహన అమ్మకాలైతే ఏకంగా 89 శాతం పుంజుకోవడం గమనార్హం. గత నెలలో త్రీవీలర్ సేల్స్ కూడా గతంతో పోల్చితే రెండింతలకుపైగా ఎగబాకాయి. ట్రాక్టర్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ జూన్లో అన్ని రకాల వాహన అమ్మకాలు 27 శాతం పెరిగాయి.
గ్రామీణ మార్కెట్ అంతంతే
గ్రామీణ ప్రాంతాల్లో గత నెల వాహన అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటీ అన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనుగోలుదారులపై తీవ్రంగా పడ్డాయన్నారు. అయితే సాధారణంగానే జూన్లో విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటాయని, టూవీలర్ సేల్స్ నెమ్మదిగా సాగుతాయని చెప్పారు. గ్రామాల్లో రైతులే కస్టమర్లు కాబట్టి.. వర్షాలపై అమ్మకాలు ఆధారపడి ఉంటాయన్నారు.
చిన్న కార్లు, టూవీలర్ అమ్మకాలకు దెబ్బ
అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం.. చిన్న కార్లు, టూవీలర్ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఎఫ్ఏడీఏ ఈ సందర్భంగా వెల్లడించింది. దాదాపు అన్నింటి ధరలూ పెరిగాయని, దీంతో ఇంటి బడ్జెట్ తలకిందులై సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు గులాటీ అన్నారు. భారీగా ఎగిసిన ఇంధన ధరలూ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయని, రవాణా భారం పెరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
‘ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతున్నది. సెమీకండక్టర్ల లభ్యత పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఎస్యూవీల డెలివరీ కోసం కస్టమర్లు ఇంకా వేచిచూడక తప్పట్లేదు. అయినప్పటికీ మార్కెట్లో కొత్త వాహనాల పరిచయం పెరిగింది. బుకింగ్స్ కూడా అంతేస్థాయిలో రావడం ఆహ్వానించదగ్గ పరిణామం’
-వింకేశ్ గులాటీ, ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు