PAN Card | మార్కెట్లో నుంచి ఉపసంహరిస్తున్న రూ.2000 కరెన్సీ నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఏదేనీ బ్యాంకులో రూ.50 వేలు అంత కంటే ఎక్కువ రూ.2000 కరెన్సీ నోట్లు డిపాజిట్ చేస్తే ‘పాన్ కార్డు’ సమర్పించాల్సిందేనని చెప్పారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని తెలిపారు. రూ.2000 నోట్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని చెప్పారు. కరెన్సీ నిర్వహణలో భాగంగానే రూ.2000నోటు ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు.
మార్కెట్ నుంచి రూ.2000 నోటు ఉపసంహరిస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ అకస్మిక ప్రకటన చేసిన తర్వాత శక్తికాంత దాస్ సోమవారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఏరోజుకా రోజు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై నియంత్రణ కొనసాగుతుందన్నారు. మంగళవారం (మే 23) నుంచి బ్యాంకుల్లో రూ.2000 నోటు డిపాజిట్లకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ.
రూ.2000 నోట్లు డిపాజిట్ చేయడానికి, మార్పిడి కోసం వచ్చే ప్రజలకు బ్యాంకుల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ హితవు చెప్పింది. ప్రస్తుతం మండు వేసవి నేపథ్యంలో భారీగా ఖాతాదారులు బారులు తీరడం వల్ల వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి వారికి సేద తీరడానికి వీలుగా నీడ కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2016లో పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) ఉపసంహరించినప్పుడు ఆయా నోట్ల మార్పిడికి బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు మరణించారన్న వార్తలు వచ్చాయి. రూ.2000నోట్ల డిపాజిట్లు, మార్పిడికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది.
మళ్లీ మార్కెట్లోకి చలామణిలోకి రూ.1000కరెన్సీ నోటు తెచ్చే ప్రతిపాదనేదీ ఆర్బీఐ వద్ద లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 2016లో ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, రూ.2000 కరెన్సీ నోటు తెచ్చామన్నారు. ఇప్పుడు వ్యవస్థలో సరిపడా కరెన్సీనోట్లు ఉన్నాయని, అందువల్లే రూ.2000 నోటు ఉపసంహరిస్తున్నామన్నారు.