ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల హవా నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఆతిథ్య సంస్థ ఓయో.. వచ్చే వారం ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కు వెళ్లనున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సెబీ అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్లు వినికిడి. ఈ ఐపీవో ద్వారా 100-120 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.9000 కోట్ల) నిధులు సేకరించాలని ఓయో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఓయోలో జపాన్ కేంద్రంగా లావాదేవీలు నిర్వహిస్తున్న సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ప్రధాన వాటాదారుగా ఉంది. ఓయోలో సాఫ్ట్ బ్యాంకు వాటా 46 శాతం.
గత 18 నెలలుగా కరోనా మహమ్మారి వల్ల నెలల తరబడి ఓయో హోటళ్లు మూత పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా పొదుపు చర్యలకు దిగింది. నష్టాల బారీన పడింది. ఓయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ అగర్వాల్ స్పందిస్తూ కరోనా రెండో వేవ్ తర్వాత భారత్లో తమ లావాదేవీలు పుంజుకుంటున్నాయన్నారు. ఐపీవో నిర్వహణ బ్యాంకులుగా కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంకులను ఓయో ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఐపీవోపై స్పందించేందుకు ఓయో ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో గత జూలైలో ఐపీవో ద్వారా స్టాక్మార్కెట్లో ప్రవేశించింది. ఇక బెర్క్షైర్ హాథ్వే మద్దతుతో పని చేస్తున్న ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, టీపీజీ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యాకా తదితర సంస్థలు కూడా ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.