IT Jobs | కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతితోపాటు ఆన్లైన్ సేవలందించే సంస్థలూ స్టార్టప్ సంస్థలు పుట్టుకొచ్చాయి. గత రెండేండ్లుగా ఏదైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవడమే. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో మొత్తం పరిస్థితులే తారుమారవుతాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఐటీ సంస్థలు మొదలు అన్ని రకాల పరిశ్రమలు డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం పరిస్థితులను మార్చేసింది. వివిధ వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో వివిధ దేశాల కీలక వడ్డీరేట్లు పెరిగాయి. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంటున్నది.
ఆర్థిక మాంద్యం ప్రభావంతో అమెరికాలో 22 వేల మందికి పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. భారత్లోని స్టార్టప్ సంస్థల్లో పని చేస్తున్న 12 వేల మంది పై చిలుకు ఐటీ నిపుణులు నిరుద్యోగులయ్యారు. కరోనా మహమ్మారి ఉధృతి వేళ లబ్ధి పొందిన స్టార్టప్ సంస్థలు ఇప్పుడు వాటి విలువ విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిరుత్సాహ పూరిత వాతావరణంలో కొత్తగా నిధులు సమకూర్చుకోవడంలో స్టార్టప్లు ఇబ్బందుల పాలవుతున్నాయి. అంతర్జాతీయంగా నెట్ఫ్లిక్స్, రాబిన్ హుడ్ అనే పైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ, పలు క్రిప్టో ప్లాట్ఫామ్స్ తమ సిబ్బందిలో కోత విధించాయి.
క్రిప్టో వరల్డ్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆర్థికంగా పతనం కావడంతో కాయిన్బేస్, జెమినీ, క్రిప్టో డాట్కామ్, వౌల్డ్, బైబిట్, బిట్ పాండా తదితర క్రిప్టో ఎక్స్చేంజ్లు, సంస్థలు తమ ఉద్యోగులను కుదించుకుంటున్నట్లు ప్రకటించాయి. పోకేమోన్ గో గేమ్ డెవలపర్ నియాంటిక్ 8 శాతం తమ సిబ్బందిని కంపెనీ నుంచి వైదొలగాలని కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు ఎలన్మస్క్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో 10 శాతం సిబ్బందిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు.
`ఫండింగ్ వింటర్` ద్వారా భారత్లోని స్టార్టప్ సంస్థలు తమ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి. ఎడ్టెక్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు ఈ ఏడాదిలో 60 వేల మందికి పైగా వదిలించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఓలా, బ్లింకిట్, బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, కార్స్ 24, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్), లిడో లెర్నింగ్, ఎంఫైన్, ట్రెల్, ఫార్ఐ, ఫుర్లాంకో తదితర స్టార్టప్లు దాదాపు 12 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపేశాయి. సంస్థల పునర్వ్యవస్థీకరణ, పొదుపు చర్యల పేరిట కొన్ని స్టార్టప్ సంస్థలు ఈ ఒక్క ఏడాదిలోనే కనీసం 50 వేల మందిని తొలగిస్తాయని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. వీటిల్లో కొన్ని స్టార్టప్ సంస్థలు మిలియన్ల డాలర్ల నిధులు పొందుతున్నాయి. ఓలా, అన్ అకాడమీ, వేదాంతు, కార్స్24, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) వంటి పలు స్టార్టప్ సంస్థలు లేఆఫ్లు ప్రకటించేశాయి.