Income Tax | ఆదాయం పన్ను మొదలు ప్రభుత్వ సేవల వరకు.. బ్యాంకుల్లో డిపాజిట్లలోనూ సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అధిక వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఇతరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం లభిస్తుంది. కానీ, వేతన జీవులు, బుల్లి వ్యాపారవేత్తలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లే ముందు వరుసలో నిలిచారు. 2021-22 (2022-23 మదింపు సంవత్సరం) ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను చెల్లింపులో సీనియర్ సిటిజన్లే అగ్రస్థానంలో ఉన్నారని తేలింది. 2020-21తో పోలిస్తే 2021-22లో 35.5 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఆదాయం పన్ను చెల్లించారు. ఆదాయం పన్ను చెల్లించిన సీనియర్ సిటిజన్లు 2020-21లో కేవలం ఐదు శాతం మాత్రమే పెరిగారు. అంటే ముదిమి వయస్సులో ఉన్న సీనియర్ సిటిజన్లు గత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం పన్ను చెల్లించారని గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారికి ముందు సంవత్సరం 2019-20తో పోలిస్తే గతేడాది ఆదాయం పన్ను చెల్లింపుల్లో సీనియర్ సిటిజన్ల వాటా 61 శాతానికంటే ఎక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి 17 శాతం ఆదాయం పన్ను వసూళ్లు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను వసూళ్లు రూ.16.61 లక్షల కోట్లయితే, అందులో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల వాటా 24 శాతం.
కరోనాకు ముందుతో పోలిస్తే తాజాగా సీనియర్ సిటిజన్ల ఆదాయం పన్ను చెల్లింపులు పెరగడానికి ఓ కారణం ఉంది. మహమ్మారికి ముందు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం మెరుగ్గా ఉండేది. కానీ విశ్వమారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు దశాబ్ధి క్రితం స్థాయికి వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించేసింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా తగ్గాయి. ఫలితంగా సీనియర్ సిటిజన్లు.. స్టాక్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లు కనిపిస్తున్నదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2020 తర్వాత ఆయా కంపెనీల్లో ఇన్వెస్టర్లపై డివిడెండ్ టాక్స్లో మార్పులు చేయడం కూడా అధిక ఆదాయం పన్ను చెల్లింపులకు కారణం అని తెలుస్తున్నది.
కరోనా మహమ్మారి వేళ.. వివిధ సంస్థల స్టాక్ విలువ కూడా భారీగా పడిపోవడం వల్ల కూడా వాటిల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. అటుపై స్టాక్ మార్కెట్లో బూమ్ వచ్చిన సంగతి తెలిసిందే. గరిష్ట స్థాయి విలువ పెరిగిన స్టాక్స్ను అధిక ధరలకు విక్రయించిన ఇన్వెస్టర్లు లాభాలు గడించారు. ఆ లాభాలపై క్యాపిటల గెయిన్స్ టాక్స్ కూడా చెల్లించడం కూడా పన్ను వసూళ్లలో తేడాకు కారణం అని తెలుస్తున్నది. 2022-23లో 18.6 శాతం మంది ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఆదాయం పన్ను చెల్లించారు. 2021-22తో పోలిస్తే 2022-23లో ఆదాయం పన్ను చెల్లించిన సీనియర్ సిటిజన్లు 73.1లక్షల నుంచి 86.71 లక్షలకు పెరిగారు.