ముంబై: విపత్తుల వేళ.. అవకాశాలు లభిస్తాయి. మన ఇండియన్లు అందుకు ముందుంటారంటే అతిశయోక్తి కాదు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాలంటే మాత్రం దాని ఆనుపానులు పూర్తిగా తెలుసున్న వారు మాత్రమే ఆ పని చేయగలరు.. ఉపాధి లేక ఇంటికి పరిమితమై స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారిని రిటైల్ ఇన్వెస్టర్లు అంటారు. కరోనా మహమ్మారి వేళ రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెట్టింపైంది.
2018-19లో రిటైల్ ఇన్వెస్టర్గా పేరు నమోదు చేసుకోవడానికి ఒక్కో ఐపీవోకు సగటున 6.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అది 2019-20 కల్లా స్వల్పంగా పెరిగి 6.88 లక్షలకు చేరుకున్నది. కానీ గతేడాది కరోనా మహమ్మారి దాడి మొదలు కాగానే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య జూమ్మంటూ దూసుకెళ్లింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది మార్చి ముగిసేసరికి సగటు ఇన్వెస్టర్ల సంఖ్య 12.73 లక్షల మందికి చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఒక్క ఏప్రిల్ నెలలోనే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 15.68 లక్షలకు చేరింది.
శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్టయిన ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జోమాటో షేర్ కోసం ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. రూ.76గా నిర్ణయమైన స్క్రిప్ట్ రూ.115 వద్ద లిస్టయింది. తదుపరి రూ.138 వరకూ దూసుకెళ్లింది. ఇటీవలి కాలంలో ఏ సంస్థకూ రాని రీతిలో భారీగా ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు.
కేవలం 10 శాతం స్క్రిప్ట్లు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జొమాటో కేటాయించింది. రూ.9,375 కోట్ల విలువైన ఐపీవోలో మొత్తం షేర్ల కోసం 32.14 లక్షల రిటైల్ ఇన్వెస్టర్ల అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఐపీవోకు వెళ్లిన ఇండిగో పెయింట్స్ షేర్ కోసం 25.88 లక్షల అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఇండిగో పెయింట్స్ ఐపీవో విలువ రూ.1,169 కోట్లు.