న్యూఢిల్లీ, జనవరి 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. దేశీయంగా ఓ పవర్, పర్ఫార్మెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో ఈ చైనా సంస్థకు ఆర్అండ్డీ సెంటర్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడే ఈ పర్ఫార్మెన్స్ పవర్ ల్యాబ్ను నెలకొల్పాలన్న దిశగా అడుగులు వేస్తున్నది. ఇదే జరిగితే ఈ సెంటర్లో ఒప్పో పెడుతున్న మూడో ల్యాబ్ ఇది కానుండటం గమనార్హం. కాగా, రాబోయే స్మార్ట్ఫోన్లలో మరింత మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం అధిపతి తస్లీమ్ ఆరిఫ్ శుక్రవారం పీటీఐకి తెలిపారు. ఈ క్రమంలోనే గతేడాది 5జీ, కెమెరాలకు సంబంధించిన ల్యాబ్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది పవర్, పర్ఫార్మెన్స్ ల్యాబ్ను తేవాలని చూస్తున్నామని చెప్పారు. థర్డ్-పార్టీ యాప్స్ను మొబైల్ యూజర్లు పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటున్నారని, దీంతో వారు పర్ఫార్మెన్స్ పవర్ సమస్యల్ని చూస్తున్నారని ఆరిఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.