Crude Oil | అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బుధవారం పెరిగింది. ముడి చమురు, సహజవాయువు ఉత్పత్తి చేస్తున్న ఒపెక్ + ( OPEC+ ) దేశాల కూటమి ఆ దిశగా అడుగులేయడమే కారణమా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటి వరకు పలు రోజులుగా 90 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర 91.91 డాలర్లకు పెరిగింది.
ఇంతకుముందు సెషన్తో పోలిస్తే బుధవారం 2.94 డాలర్లు పెరిగి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.91 డాలర్లకు చేరింది. యూఎస్ డబ్ల్యూటీఐ ఫ్యూచర్ ధర కూడా ఐదు శాతం అంటే 86.57 డాలర్లకు పెరిగింది. గత సెషన్తో పోలిస్తే 2.89 శాతం పెరుగుదల నమోదైంది.
ముడి చమురు ధరలను స్థిరీకరించాలన్న లక్ష్యంతో ఒపెక్+ కూటమి ప్రతి రోజూ 20 లక్షల (రెండు మిలియన్లు) బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తిని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నది. వియన్నాలో జరిగిన ఒపెక్+ దేశాల కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సభ్య దేశాల ప్రతినిధులు చెప్పారు.
ఇప్పటికే ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతం అవుతుంటే ముడి చమురు ఉత్పత్తి తగ్గించడం వల్ల ధరలు మరింత భగ్గుమని మండుతాయని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు తగ్గిస్తే 2020 తర్వాత భారీ తగ్గింపు అవుతుంది. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇప్పటికే పలు ఒపెక్ సభ్య దేశాలు తమ కోటా కంటే తక్కువ ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజూ 2 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి తగ్గించినా అంతర్జాతీయ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక మిలియన్ నుంచి 1.5 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదని కూటమి ప్రతినిధులు చెబుతున్నారు.
అమెరికాతోపాటు పలు దేశాలు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మరింత ముడి చమురు ఉత్పత్తి చేయాలని ఒపెక్+ దేశాలను కోరుతున్నాయి. వచ్చేనెలలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చమురు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ముడి చమురు ఉత్పత్తి తగ్గిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతాయని అమెరికా ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో విదేశాలకు పెట్రోల్, డీజిల్, ఇతర రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిని నిషేధించింది.
వియన్నాలో జరిగిన సమావేశానికి హాజరైన ఒపెక్ + కూటమి దేశాల ప్రతినిధులు నోరు మెదపడం లేదు. సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ సల్మాన్.. తమ కూటమి ప్లాన్లపై స్పందించడానికి నిరాకరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంధన మంత్రి సుహైల్ అల్ మాజ్రోవైయీ మాత్రం తమ టెక్నికల్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.