OnePlus-IIT Madras | గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-మద్రాస్)తో కలిసి నెవర్ సెటిల్ (Never Settle) అనే స్కాలర్ షిప్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భారత్లో స్మార్ట్ ఫోన్ల విక్రయం ప్రారంభమై 10 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ‘స్కాలర్షిప్’ ఇన్షియేటివ్ తీసుకొచ్చినట్లు తెలిపింది. ఐఐటీ మద్రాస్ బీటెక్ కోర్సులో కొత్తగా చేరిన విద్యార్థులు, పాత విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందచేస్తామని పేర్కొంది.
మెరిట్ కం అర్హత ఆధారంగా స్కాలర్ షిప్ మంజూరు చేసేందుకు అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తామని వన్ప్లస్ వెల్లడించింది. అర్హులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా అవరోధాలను నిరోధించడమే లక్ష్యంగా గణనీయ స్కాలర్ షిప్ అందజేయడానికే ‘నెవర్ సెటిల్ (Never Settle)’ అనే స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ తెచ్చినట్లు తెలిపింది. అయితే, స్కాలర్ షిప్ పూర్తి వివరాలు వెల్లడించలేదు.
పదేండ్ల క్రితం భారత్లో వన్ ప్లస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభించామని, భారతీయ సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతోనే ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ పీట్ లా చెప్పారు. కొత్త ఫోన్ల రూపకల్పనలో ఐఐటీ మద్రాస్ సహకారం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందన్నారు. భారతీయ యువతకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో జత కలిసినందుకు వన్ ప్లస్ లీడర్ షిప్ టీంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఐఐటీ-మద్రాస్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచగ్నుల చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భవిష్యత్ ఆవిష్కరణలకు వన్ ప్లస్ నెవర్ సెటిల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ సాధికారత కల్పిస్తుందన్నారు.